
పల్లెలపై పంజా..
నల్లమల అటవీ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి పెద్ద పులులు. అభయారణ్యం నుంచి తరచూ జనావాసాల వైపు వస్తుండడం గిరిజన గ్రామాల్లో అలజడి రేపుతోంది. రాత్రుళ్లు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. పెద్దపులులు పశువులపై దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు. తరుచూ పశువులపై పంజా విసురుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బేస్ క్యాంపుల
ఏర్పాటు...
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరి ఆలయం, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. వీటి సంరక్షణకు ఇలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అవి పక్కాగా అమలు కాకపోవడంతో తరుచూ అవి గ్రామాలవైపు వస్తున్నాయి.
మార్కాపురం: ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎన్ఎస్టీఆర్ ( నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్)లో దాదాపు రెండు వందల పులులు ఉన్నాయి. ఇవి ఆహారం, నీళ్ల కోసం తరుచూ అటవీ సమీప గ్రామాలవైపు వస్తున్నాయి. వన్యప్రాణులను వేటాడుతూ కొన్ని, పరిసర గ్రామాల్లో పశు సంపద కోసం కొన్ని వస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు, పశువుల కాపర్లు, పొలాలకు వెళ్లే రైతులు, ఉపాధి కూలీలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, అర్ధవీడు, పెద్దారవీడు, మార్కాపురం తదితర మండలాల పరిధిలోని అటవీ సమీప గ్రామాల వైపు తరుచూ పులులు వస్తూ భయపెడుతున్నాయి. ఏ సమయంలో ఏవైపు నుంచి వచ్చి పెద్దపులి దాడి చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో పెద్దపులి 4 గేదెలు, 2 ఎద్దులపై దాడిచేసి హతమార్చాయి. దీంతో పశువులను మేపుకునేందుకు పశువుల కాపరులు, పొలాలకు వెళ్లేందుకు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత నెలలో మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తాండ ప్రాంతాల్లో పెద్దపులి దాడిచేసి గేదెను చంపింది. దీనిని పి139 పెద్దపులి (మగపులి)గా అటవీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెద్దారవీడు మండలం కలనూతల, సుంకేశుల, గుండంచర్ల, మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తాండ, అర్ధవీడు మండలం బొల్లుపల్లి, మిట్టమీదిపల్లి, కొత్తూరు, అయ్యవారిపల్లి, వీరభద్రాపురం గ్రామాల్లో పెద్దపులి సంచారాన్ని గ్రామస్థులు కనుగొన్నారు.
● ఈ నెల 13వ తేదీ యర్రగొండపాలెం మండలం పాలుట్లలో పశువులపై పెద్దపులి దాడిచేసి రెండు ఎద్దులను చంపింది.
● ఈనెల 10వ తేదీ అర్ధవీడు మండలం బొల్లుపల్లికి చెందిన నాగేశ్వరరావు తన ఎద్దులను కొట్టంలో కట్టివేశారు. పెద్దపులి ఎద్దుపై దాడిచేసి చంపి అడవిలోకి వెళ్లిపోయింది.
● ఈనెల 6వ తేదీ మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామ శివార్లలో వెంకటేశ్వరరెడ్డికి చెందిన గేదెను పెద్దపులి చంపింది.
● మే 30న అర్ధవీడు మండలం పాపినేనిపల్లి అటవీ ప్రాంతంలో ఆవుపై పెద్దపులి దాడిచేసి చంపింది. బొప్పాయితోటలో ఆవు మృతిచెందినట్లు స్ధానికులు గుర్తించారు.
● ఏప్రిల్ 30న మాగుటూరు తండాలో పెద్దపులి గేదెను చంపింది. ఏప్రిల్ 10న పెద్దారవీడు మండలం కలనూతలలో గేదైపె పులి దాడి చేసి చంపింది.
మొత్తంగా పది నెలల కాలంలో దాదాపు 30 ఆవులు, ఎద్దులను హతమార్చాయి. దీంతో రైతులు, ప్రజలు, పశుపోషకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గొట్టిపడియ సంఘటనలో పులి పాదముద్రలు సేకరించారు.
ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దు
పశువుల మేత కోసం ఒంటరిగా అడవుల్లోకి పశు పోషకులు, రైతులు వెళ్లవద్దు. గ్రామ మొదట్లోనే పశువులను మేపుకోండి. గొట్టిపడియలో పెద్దపులి బర్రె దూడను చంపేసింది. వన్యప్రాణులు, పులులు కనిపిస్తే మాకు సమాచారం అందించండి. వాటిని చంపే ప్రయత్నం చేయవద్దు. విద్యుత్ తీగలు, వలలు వేయవద్దు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. – నాగరాజు, డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, మార్కాపురం.
నల్లమలలో 200 వరకూ పులులు ఆహారం కోసం నిత్యం గిరిజన గ్రామాలకు పశువులపై దాడులు భయాందోళనలో అటవీ సమీప గ్రామాల ప్రజలు పులల సంరక్షణకు బేస్ క్యాంప్

పల్లెలపై పంజా..