
నియంత పాలనకు ఏడాది
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: రాష్ట్రంలో దుర్మార్గపు నియంత పాలన ఏడాది కాలం పూర్తి చేసుకుందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేక పోయిందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ‘5 కోట్ల ప్రజలకు వెన్ను పోటు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఏడాది కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు చవిచూస్తున్నారని, దురాగతాలు, అరాచకాలు, తప్పుడు కేసులు బనాయించడం, ఆడబిడ్డలపై అత్యాచారాలు, హత్యలు, దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన యువతపై గంజాయి కేసులు నమోదు చేయడం లాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల గురించి ప్రచురించటానికి సూట్ కేస్ అంత పుస్తకం కూడా సరిపోదని ఆయన వ్యగ్యంగా అన్నారు. ఆర్భాటంగా తల్లికి వందనం పథకాన్ని అరకొరగా అమలు చేసి సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేశామని, వాటి గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక తెగకోస్తానని సీఎం అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూల్చివేయడమే పనిగా పెట్టుకున్నారని, ప్రశ్నించిన నాయకులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడమే వారు సాధించిన ఘనకార్యమని అన్నారు.
మహిళలపై జరుగుతున్న దాడులపై నోరుమెదపరే..
డీసీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో ఆయన ఎటువంటి చర్య తీసుకోలేక పోయారని, సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తాజాగా రూ.80 వేలు అప్పు చెల్లించలేదని ఒక మహిళను తన కన్నకొడుకు ఎదురుగా చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన సంఘటన కలచి వేస్తుందని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికార మదం, కండకావరంతో మహిళలపై విరుచుకొని పడుతున్నారని, కూటమి ప్రభుత్వంలో ఆడవారికి ఇస్తున్న గౌరవం ఇదేనని ఆయన అన్నారు.
హామీలన్నీ నెరవేర్చిన వైఎస్ జగన్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచారని, ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరుతోనే అందచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని సజావుగా అమలు చేశారన్నారు. కూటమి పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం వలన వాళ్లు రోడ్డు ఎక్కుతున్నారని, పొగాకు కొనుగోలు చేయాలని పురుగుల మందు బాటిళ్లతో ఆందోళన చేస్తున్న రైతుల్లో టీడీపీ వర్గీయులు కూడా ఉండటం గమనార్హమని అన్నారు. దగా పడుతున్న పొగాకు రైతులను పరామర్శించటానికి, వారికి మద్దతుగా జగన్మోహన్రెడ్డి పొదిలికి వచ్చిన సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన రైతులు, అభిమానులను చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోయిందని, టీడీపీ వర్గీయులతో జగనన్న ర్యాలీపై రాళ్లు రువ్వించిందని అన్నారు. రాళ్లు విసిరింది టీడీపీ వాళ్లని స్పష్టంగా తెలుస్తున్నా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. సమావేశంలో ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్, జెడ్పీటీసీ సీహెచ్ విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకట రమణారెడ్డి, జిల్లా కార్యదర్శులు కె.ఓబులరెడ్డి, సింగా ప్రసాద్, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె రమేష్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పబ్బిశెట్టి శ్రీనివాసులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, సర్పంచ్లు ఆర్.అరుణాబాయి, కోటిరెడ్డి, సుబ్బారెడ్డి, వివిధ విభాగాల నా యకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, ఎం.బాలగురవయ్య, గుమ్మా ఎల్లెష్ యాదవ్, పల్లె సరళ, రోషిరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, మురారి గాలయ్య యాదవ్ పాల్గొన్నారు.