
పార్టీ కార్యకర్తకు అన్నా పరామర్శ
తర్లుపాడు: ఈనెల 11న పొదిలిలో పోరుబాట జరిగిన కార్యక్రమంలో రాళ్లదాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని తుమ్మలచెరువుకు చెందిన షేక్ నన్నేవలిని మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అన్నా వెంట మండల పార్టీ కన్వీనరు మురారి, కౌన్సిలర్ ముంగమూరి శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి, సర్పంచ్లు పెద్దమస్తాన్, రమణారెడ్డి, పార్టీ నాయకులు భాస్కర్రెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, తుమ్మలచెరువు వైఎస్సార్ సీపీ నాయకులు అబ్దుల్, బూదాల గురవయ్య, సీహెచ్ రమేష్ తదితరులు ఉన్నారు.
కుటుంబ జీవనోపాధుల వివరాలు అప్డేట్ చేయాలి
● డీఆర్డీఏ పీడీ నారాయణ
ఒంగోలు వన్టౌన్: స్వయం సహాయక గ్రూపుల కుటుంబ జీవనోపాధుల వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టీ నారాయణ సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు భాగ్యనగర్లోని డీఆర్డీఏ ఆధ్వర్యంలోని వెలుగు–టీటీడీ సెంటర్లో జిల్లాలోని 36 మండలాల పరిధిలోని డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు కార్యాలయం సిబ్బందితో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పీడీ మాట్లాడుతూ ఇప్పటి వరకూ జిల్లాలోని 45,257 గ్రూపులకు గానూ 18,685 గ్రూపుల జీవనోపాధుల వివరాలు మాత్రమే వెబ్సైట్లో అప్డేట్ చేశారన్నారు. వార్షిక రుణ ప్రణాళిక, సూక్ష్మ రుణ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్య సాధనపై సమీక్ష నిర్వహించారు. అదే విధంగా జూన్ 20వ తేదీ పొదుపు మహిళల యోగాంధ్రపై కమ్యూనిటీ కోఆర్డినేటర్ల వారీగా సమీక్ష నిర్వహించారు. సెర్ప్ను స్థాపించి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమేష్, డీపీఎంలు లైవ్లీహుడ్ డీ దానం, బ్యాంక్ లింకేజి అంబేడ్కర్, పెన్షన్లు లక్ష్మీరెడ్డి, సంస్థాగత నిర్మాణాలు రజనీకాంత్, ఫైనాన్స్ కృపారావు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
తిరుపతిరెడ్డి
ఫిర్యాదు ఏమైంది ?
పొదిలి: పొగాకు రైతుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకు, ధరలు పెంచేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 11వ తేదీ పొదిలిలో పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన పోరుబాట ర్యాలీలో వేలాది మంది పాల్గొనగా, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పోలీసుల అనుమతి లేని నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోరుబాట ర్యాలీపై కొంత మంది వ్యక్తులు రాళ్లు, చెప్పులు వేశారు. ఓ రాయి తగిలి గజ్జలకొండ గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నారు తిరుపతిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ స్టేషన్లో కూడా దాడిలో గాయపడిన విషయమై పార్టీ నాయకులతో కలిసి తిరుపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. ర్యాలీలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్త తిరుపతిరెడ్డి చేసిన ఫిర్యాదు గురించి సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీఐ చట్టం ద్వారా స్టేషన్ అధికారికి పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు మంగళవారం దరఖాస్తు చేశారు.
తిరుపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు స్టేటస్ ఎలా ఉంది, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా, విచారణ జరుగుతుందా లేదా అనే విషయాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించటంతో 18 మంది రిమాండ్లో ఉన్నారని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సభ్యులు తెలిపారు.
కార్యక్రమంలో లీగల్ సెల్ ఒంగోలు అసెంబ్లీ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, ఒంగోలు సిటీ లీగల్ సెల్ అధ్యక్షుడు కాకుటూరి సంపత్కుమార్, జిల్లా ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు కాళహస్తి వెంకట శేషారెడ్డి, జిల్లా సభ్యులు ధర్నాసి రామారావు, ఎంవి.రమణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తకు అన్నా పరామర్శ