
సీఎం ఇలాకాలో మహిళలకు రక్షణ లేదు
● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దీనికి కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనను నిదర్శనంగా పేర్కొనవచ్చని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో టీడీపీ నాయకుడు మణి కన్నప్ప ఒక మహిళను అసభ్యంగా దూషించడమే కాకుండా అత్యంత దుర్మార్గంగా చెట్టుకు కట్టేయడం యావత్ దేశ ప్రజలను కదిలించిందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతపురం జిల్లాలో ఒక బాలికను 18 మంది అత్యాచారం చేసిన తరువాత కూడా ప్రభుత్వం లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలు అత్యాచారానికి గురవుతున్నారని, పాలకులు మాత్రం కక్ష సాధింపు చర్యలతోనే కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకోవడమే కాకుండా వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి పాలకులు మహిళల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుప్పం మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.