
శ్రీనివాస ప్రసాద్కు వరల్డ్ ఇన్ఫ్లుయన్సర్ అవార్డు
కంభం: గత 32 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంభం పట్టణానికి చెందిన డాక్టర్ పులిశ్రీనివాస ప్రసాద్కు జాతీయ సాక్షరత సమితి వారు వరల్డ్ ఇన్ఫ్లుయన్సర్ అవార్డును ప్రదానం చేశారు. కలకత్తాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యజిత్ భట్యాచార్య, భారత చిత్ర నిర్మాణ సంస్థ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సవ్యసాచి చేతుల మీదుగా ఆయనకు అవార్డుతో పాటు ప్రశంస పత్రం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి అందించే అవార్డు తనకు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. పలువురు ప్రముఖులు అవార్డు గ్రహీతను అభినందించారు.
అప్పీల్కు వెళ్లే ఉపాధ్యాయులు నిబంధనలు పాటించాలి
ఒంగోలు టౌన్: బదిలీ కౌన్సెలింగ్పై అప్పీల్ చేసుకునే ఉపాధ్యాయులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.కిరణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీలపై ఏవైనా ఫిర్యాదులుంటే ముందుగా జిల్లా కమిటీకి, జిల్లా విద్యాశాఖ అధికారికి అప్పీల్ చేసుకోవాలన్నారు. ఒకవేళ జిల్లా విద్యాశాఖ అధికారి మీద అప్పీల్ చేసుకోవాలనుకుంటే రీజనల్ కమిటీకి అంటే రీజినల్ జాయింట్ డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ఫిర్యాదు చేయాలని వివరించారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవాలనుకుంటే సేట్ లెవెల్ కమిటీకి చెందిన పాఠశాల విద్యా కమిషనర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. చట్టపరమైన పరిష్కారాల కోసం వెళ్లే ఉపాధ్యాయులు అన్నీ స్థాయిల అప్పీల్ నిబంధనలను పాటించాలని, లేకపోతే ఏపీసీఎస్ రూల్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.