హరిత శోభితంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: హరిత శోభిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సంబంధిత శాఖలు సమన్వయంతో వివిధ వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవనం మనం్ఙ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమం అమలుపై మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీఎప్ఓ (సోషల్ ఫారెస్ట్) రాజశేఖర్ మాట్లాడుతూ 5 వ తేదీన ప్రకాశం జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటడం లక్ష్యమన్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు 6 నెలల వ్యవధిలో జిల్లాలో 35 లక్షల 76 వేలకు పైగా మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 36 శాతం అటవీ విస్తీర్ణం ఉందని, దీనిని 50 శాతానికి పెంచేలా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థల్లో విస్తృత స్థాయిలో వీటిని నాటేలా చూడాలన్నారు. సంబంధిత శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నాటేలా మొక్కలను సరఫరా చేయాలని హార్టీకల్చర్, అటవీ శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యాన అధికారి గోపి చంద్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాఘవరెడ్డి, డ్వామా ఏపీడీ వండర్ మాన్, హౌసింగ్ బోర్డు ఎస్ఈ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల సంస్థ జీఎం శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి అంజల, డీపీఓ గొట్టిపాటి వెంకట నాయుడు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, జిల్లా ఉప విద్యాధికారి చంద్ర మౌళి, జిల్లా పరిషత్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


