
నాగులుప్పలపాడుకు తొలి మహిళా ఎస్సై
● బాధ్యతలు స్వీకరించిన
షేక్ రజియా సుల్తానా
నాగులుప్పలపాడు: స్థానిక పోలీస్స్టేషన్కు మొదటిసారి మహిళా ఎస్సైను నియమించారు. నూతన ఎస్సైగా షేక్ రజియా సుల్తానా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన బి.శ్రీకాంత్పై పలు ఆరోపణలు రావడం, ఎస్పీ దామోదర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు స్టేషన్కు ఎస్సైగా రజియా సుల్తానాను నియమించడంతో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని తెలిపారు. పోలీస్స్టేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారి బాధ్యతలు చేపట్టిన మహిళా ఎస్సైకి సిబ్బంది అభినందనలు తెలిపారు.
దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి
ఒంగోలు వన్టౌన్: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మాలలు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ప్రభుత్వ సముదాయాల కార్యాలయం వద్ద ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, సోషల్ బహిష్కరణలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు.