
టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. బదిలీల నోటిఫికేషన్ బుధవారం వెలువడనున్నట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి తాము ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం, విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
అంతా ఆన్లైన్లోనే..
బదిలీలను ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాతిపదికన నిర్వహించనున్నారు. బదిలీల దరఖాస్తు విధానం, స్థానాల ఎంపిక, కేటాయింపు ప్రక్రియ మొత్తం కూడా ఆన్లైన్లో జరగనుంది. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మే 31వ తేదీ వరకు విద్యాసంవత్సరాన్ని ప్రాతిపదికన తీసుకోనున్నారు. వీటికి సంబంధించి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు కనీస సర్వీసు రెండేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వరకు తీసుకోనున్నారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లుగా నిర్ణయించారు.
ఖాళీ వివరాలన్నీ డిస్ప్లేలో..
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు డిస్ప్లే చేస్తారు. 2025 మే నెలాఖరు వరకు ఉన్న ఖాళీలన్నీంటినీ బదిలీల్లో చూపుతారు. 2020 మే 31కు ముందు పాఠశాలల్లో చేరిన ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు, అదే పాఠశాలల్లో విద్యా సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. 2017 మే 31కి ముందు పాఠశాలల్లో చేరిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. 2027 మే నెలాఖరు లోగా ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు పూర్తయితే బదిలీ ఉంటుంది. ఎనిమిదేళ్లు పూర్తికాకపోతే బదిలీల నుంచి మినహాయింపు అవకాశం ఉంది. జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో 11,200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో తప్పనిసరి బదిలీలకు సంబంధించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినవారు, మిగులు ఉపాధ్యాయులు 5,255 మంది దాకా ఉండవచ్చని సమాచారం. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఉపాధ్యాయ సంఘాల సూచనలు
● బదిలీల జీఓ తక్షణమే విడుదల చేసి వేసవి సెలవుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలి
● బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్ టూ హైస్కూల్స్లో ఇంటర్మీడియెట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి
● ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలి
● స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టులు ఖాళీలుగా చూపాలి
ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలు..
● జిల్లాలో ప్రమోషన్ సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాతే ప్రమోషన్స్ ప్రక్రియ చేపట్టాలి.
● మున్సిపల్ పాఠశాలల్లో అప్గ్రేడేషన్ ప్రక్రియ సత్వరమే చేపట్టి ప్రమోషన్లు ఇవ్వాలి.
● స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్) పోస్టుల్లో హైకోర్టు తీర్పు అమలు చేసిన తర్వాత మిగిలిన పోస్టుల్లో లాంగ్వేజ్ పండిట్లు లభ్యం కానప్పుడు అర్హులైన ఎస్జీటీలకు ప్రమోషన్ ఇవ్వాలి. స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టుల్లో కూడా అర్హులైన ఎస్జీటీలకు ప్రమోషన్ ఇవ్వాలి.
మా సూచనలు పరిగణలోనకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
అన్నీ ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలనే ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్గా నియమిస్తామనడం సరికాదు. అధిక సంఖ్యలో ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి. ప్రభుత్వ విధానాలు విద్యారంగానికి ఉపయోగపడేలా ఉండాలే తప్ప నష్టం కలిగించే విధంగా ఉండకూడదు.
– కొమ్మోజు శ్రీనివాసరావు, యుటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు

టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం