
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోనని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాలకృష్ణ తో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, పార్ధసారథి, వరకుమార్, విజయజ్యోతితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్టీ వర్గీకరణతో యానాదులకు న్యాయం
ఒంగోలు వన్టౌన్: ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యానాది పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద యానాదులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న యానాది సంఘ నాయకుడు కేసీ పెంచలయ్య యానాది మాట్లాడుతూ ఏపీలో 10 లక్షల మంది యానాదులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే గిరిజన తెగల్లో అత్యధిక జనాభా యానాదులు ఉన్నారన్నారు. గిరిజన జాతుల్లో జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న యానాదులు నేటికీ అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారన్నారు. యనాదులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ఎస్సీ వర్గీకరణలా ఎస్టీలను కూడా వర్గీకరిస్తే యానాదులు అభివృద్ధి చెందుతారన్నారు. యానాదుల అభివృద్ధి కోసం యానాదుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. సమితి జిల్లా అధ్యక్షుడు కే మాల్యాద్రి యానాది అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జండ్రోజుపల్లి ఆంజనేయులు, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు.
కళ్లకు గంతలతో
సీహెచ్ఓల నిరసన
ఒంగోలు టౌన్: పదోన్నతులు, ఇంక్రిమెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీహెచ్ఓలు చేస్తున్న సమ్మె సోమవారం 7వ రోజుకు చేరింది. రోజుకో విధమైన వినూత్న నిరసనలు చేస్తున్న సీహెచ్ఓలు కళ్లకు నల్లటి గంతలు కట్టుకొని దీక్షలో పాల్గొన్నారు. ఏపీఎన్జీవో ప్రసిడెంట్ కె.శరత్బాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెతో గ్రామీణ ప్రజలు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్న సంగతిని గ్రహించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్జీజీఓ తాలుకా ప్రసిడెంట్ మంజీష్, ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం.రాజేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్, కార్యదర్శి ప్రసన్న, ఉపాధ్యక్షురాలు జీవన జ్యోతి, రామాంజనేయులు, కామేష్ తదితరులు పాల్గొన్నారు.
కగార్ పేరుతో ఆదివాసీలను బలిగొంటున్న కేంద్రం
ఒంగోలు టౌన్: కగార్ ఆపరేషన్ పేరుతో అమాయక ఆదివాసీలను బలిగొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. అడవుల్లో జీవించే ఆదివాసీలను తరిమికొట్టి ఖనిజ సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్లను దోచిపెట్టే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు