
ముంచెత్తిన ముసురు
ఒంగోలు అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వానలు ముసురుపట్టి కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో యంత్రాంగం జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు. మండల స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా వారిని హెచ్చరించారు. భారీవర్షాల నేపథ్యంలో మంగళవారం కూడా జిల్లాలో అన్నీ అంగన్వాడీ, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా సాయంత్రానికి సరాసరి 25.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ నాలుగు రోజుల పాటు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికార యంత్రాంగం సూచిస్తోంది. భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో పలు రహదారులు, ఊళ్లలోని రోడ్లు దెబ్బతిన్నాయి. డ్రైనేజిలు సక్రమంగా నిర్వహించకపోవడంతో డ్రైన్లు పొంగి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రంలో ఒంగోలులో బస్టాండ్ సెంటర్ నుంచి ఏ కాలనీ చూసినా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వర్షపు నీరు కాలనీల్లో చేరడంతో కనీసం రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. కలెక్టర్ తమీమ్ అన్సారియా మండల, జిల్లా స్థాయి అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాలకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తీర ప్రాంత మండలాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను గమనించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తుఫాన్ షెల్టర్లకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు ఏవైనా ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఉండే విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టళ్లలోకి తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, వైద్య, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య కార్మికుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు, వివిధ శాఖల సమన్వయం కోసం కలెక్టరేట్లో 1077 టోల్ఫ్రీ నంబర్తో కంట్రోలు రూమ్ ఏర్పాటు చేశారు. డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లోను కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. కంట్రోలు రూములో పనిచేసే సిబ్బంది వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తెలియచేసి ప్రతి గంటకు నివేదిక అందజేయాలన్నారు.
కలెక్టరేట్ కంట్రోలు రూమును పరిశీలించిన కలెక్టర్
జిల్లాలో భారీ వర్షాల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోలు రూము, మీడియా వాచింగ్ రూమును కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి మీడియాలో వస్తున్న తుఫాన్ సంబంధిత అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని పై అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.
జిల్లాలో 25.5 మి.మీ సరాసరి వర్షపాతం
సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్నీ మండలాల్లో సరాసరి 25.5 మిల్లీ మీటర్లుగా నమోదైంది. సింగరాయకొండలో అత్యధికంగా 59.6 మి.మీ నమోదైంది. పొన్నలూరు 48.4, టంగుటూరు 44.4 మి.మీ, జరుగుమల్లి 41.2, సీఎస్పురం 39.6, కొత్తపట్నం 39.6 మి.మీ, ఒంగోలు 38.4 మి.మీ, పీసీపల్లి 34.6, మర్రిపూడి 32, తాళ్లూరు 32.4, చీమకుర్తి 31.2, కనిగిరి 30.2, నాగులుప్పలపాడు 29.8, కొండపి 28, కొనకనమిట్ల 27.8, వెలిగండ్ల 27, కురిచేడు 25.6, సంతనూతలపాడు 25, ముండ్లమూరు 24.2, హెచ్ఎంపాడు 23.6, పామూరు 23.8, దొనకొండ 23.4, మద్దిపాడు 23, పొదిలి 22.2, దర్శి 21.4, పెద్దారవీడు 19, మార్కాపురం 17.2, బేస్తవారిపేట 16.4, తర్లుపాడు 16.2, కంభం 16, కొమరోలు 15, దోర్నాల 14, అర్థవీడు 14, గిద్దలూరు 12.2, రాచర్ల 12, త్రిపురాంతకం 10.4, యర్రగొండపాలెం 5.6, పుల్లలచెరువు 2.8, మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు 25.5 మి.మీ సరాసరి వర్షపాతం నమోదు డ్రైనేజీల నిర్వహణ సరిగా లేక లోతట్టు ప్రాంతాలు జలమయం నేడు అన్ని విద్యా సంస్థలకు సెలవు మరో నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాల సూచన
ఖరీఫ్, రబీ పంటలపై ప్రభావం
ఒంగోలు సబర్బన్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి జిల్లాలో ఇప్పటి వరకు సక్రమంగా వర్షాలు కురవనే లేదు. పశ్చిమ ప్రకాశంలో అయితే బోర్లలో నీళ్లు అడుగంటాయి. కనీసం అల్పపీడన ద్రోణి ప్రభావంతోనైనా వర్షాలు పడుతుండటంతో జిల్లాలోని రైతాంగం సంతోషంతో ఉన్నారు. ఈ వర్షంతో అటు రబీలోనూ, ఇటు ఖరీఫ్లోనూ వేసిన పంటలకు కొంత ఊపిరులూదినట్లయింది. జిల్లాలో మొదటి రోజు ఆదివారం పెద్దారవీడు, దోర్నాల, పుల్లలచెరువు, త్రిపురాంతకం మినహా జిల్లాలోని 34 మండలాల్లో వర్షాలు కురిశాయి. మొదటి రోజు జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో అత్యధికంగా 75.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆ తరువాత పొన్నలూరు మండలంలో 65.2 మిల్లీ మీటర్లు, సీఎస్ పురంలో 55.4, జరుగుమల్లి 53.8, కొండపిలో 48.8, సింగరాయకొండలో 47.2, పామూరు 45, టంగుటూరు 40.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 10 మిల్లీ మీటర్ల నుంచి 40 మిల్లీ మీటర్లలోపు వర్షం పడిన మండలాల్లో కొత్తపట్నం, పీసీపల్లి, మద్దిపాడు, సంతనూతలపాడు, హెచ్ఎం పాడు, ఎన్జిపాడు, వెలిగండ్ల, పొదిలి, కనిగిరి, యర్రగొండపాలెం, మర్రిపూడి, చీమకుర్తి మండలాలు ఉన్నాయి. మిగతా మండలాల్లో 2 మిల్లీ మీటర్ల నుంచి 10 మిల్లీ మీటర్ల లోపు వర్షం కురిసింది. ఇక రెండో రోజు సోమవారం తెల్లవారు జాము నుంచే జోరుగా వర్షం కురుస్తూనే ఉంది. ముసురుపట్టి తెరిపిలేకుండా వర్షం పడటంతో రోడ్లన్నీ ఒంగోలు నగరంలో నిర్మానుష్యంగా మారాయి.

ముంచెత్తిన ముసురు

ముంచెత్తిన ముసురు

ముంచెత్తిన ముసురు

ముంచెత్తిన ముసురు