
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించితేనే తెలంగాణ రైతులకు న్యాయం చేకూరుతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దని, ఇది ఒక నినాదం కావాలని చెప్పారు. గత 70 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 37 రోజుల్లో 34 మంది రైతులు బలవంతంగా తనువు చాలించారంటే.. ప్రభుత్వం రైతుల పట్ల ఎలాంటి వైఖరి అనుసరిస్తున్నదో తెలుస్తోందని చెప్పారు.
ఈమేరకు పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఐకేపీ సెంటర్లు ఉండబోవని అధికార పార్టీ చెప్పడమే కాకుండా వానాకాలం వడ్ల కొనుగోలులో జాప్యంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని షర్మిల వాపోయారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం లేదని ఆమె చెప్పారు. ఆ రోజు పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలకు దూరంగా ఉండాలని, వీలైతే సేవా కార్యక్రమాలు చేసి రైతులకు భరోసా కల్పించాలని కోరారు.