కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “టీఎంసీని బంగాళాఖాతంలోకి విసిరేయండి. పశ్చిమ బెంగాల్ ప్రజలు భయపడకుండా ఓటు వేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను గద్దె దించండి. ఈసారి ఎవరూ భయపడకూడదు. బెంగాల్ ఓటర్లను ఎవరూ అడ్డుకోలేరు.
భవానీపురంలో సువేందు అధికారికి మద్దతు ఇవ్వండి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. అధికార టీఎంసీ పార్టీపై అవినీతి ఆరోపణల మచ్చ ఉంది. పశ్చిమ బెంగాల్లో మార్పు వస్తుంది. కానీ భవానీపూర్లో మార్పు కావాలా.. లేదా? మా అభ్యర్థి సువేందు అధికారికి మీ ఓట్లు వేయాలని కోరడానికి ఇక్కడికి వచ్చాను. 2014 నుంచి మోదీ జీపై నమ్మకం ఉంచిన వారు మార్పు చూశారు.
గతంలో మమత ఒక ఎన్నికలో ఓడిపోయారు, ఈ సారి బెంగాల్ అంతటా ఓడిపోతారు. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం మారాలనే స్వరం వినిపిస్తోంది. మమతకు బైబై చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి 15 రోజులు రాష్ట్రంలో ఉంటాను’’ అని చెప్పారు.
భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. 294 సభ్యులు ఉండే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఓటింగ్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో (రెండు దశల్లో) జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. 2021లో ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించింది. బీజేపీ 77 స్థానాలు దక్కించుకుంది.


