
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అక్రమ కేసుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులపై, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త తనను షాక్కు గురిచేసిందని అన్నారాయన. ఈ క్రమంలో రఘురామ వ్యవహారశైలిపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్నిఆర్ఎస్సీ తన ట్వీట్లో తప్పుబట్టారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని.. అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని.. మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
.. దురదృష్టవశాత్తూ నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారన్న ఆర్ఎస్పీ.. గోద్రా మారణహోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్కు చెందిన ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు రఘురామకృష్ణరాజుపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
అబద్ధాలడడం అలవాటుగా ఉన్న ఇదే రాజకీయ నాయకుడు(రఘురామను ఉద్దేశిస్తూ..).. 2021లో పార్లమెంటులో నాపై నిరాధార ఆరోపణలు చేశారు. పైగా పేదలకు విద్య అందించే విషయంలోనూ ఈ వ్యక్తి ఏనాడూ సానుకూలంగా లేడు. అలాంటిది ఆయన ఎలా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేదీ ఆశ్చర్యంగా ఉంది అని ఆర్ఎస్పీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర చోట్ల సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను సైతం ట్యాగ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Shocked to hear the news of FIR on senior IPS officers(DGP rank) of AP Cadre Mr PV Sunil Kumar and Mr PSR Anjaneyulu along with former CM of AP, @ysjagan. This matter pertained to the alleged custodial torture of former MP of YSRCP, RaghuRamaKrishnam Raju @ RRR in in AP in 2021.…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 13, 2024