సీబీఐ విచారణకైనా సిద్ధం

లోకేశ్ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి : మంత్రి కాకాణి
స్విమ్మింగ్ పూల్లో విదేశీ వనితలతో లోకేశ్ ఫొటోలు ప్రదర్శించిన ఎమ్మెల్సీ దువ్వాడ
నేను మగాడ్ని.. ఇంకా పెద్దవి చేసి చూపించుకోండి : లోకేశ్
సంగం బ్యారేజ్కి వైఎస్ శంకుస్థాపన చేస్తే సీఎం జగన్ ప్రారంభించారు : మంత్రి అంబటి
‘మండలి’లో వ్యవసాయంపై వాడివేడిగా చర్చ
సాక్షి, అమరావతి: నెల్లూరు కోర్టులో రికార్డుల మాయం వ్యవహారంలో తన ప్రమేయం ఉందంటూ టీడీపీ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ఈ విషయంలో సీబీఐ విచారణకైనా తాను సిద్ధమేనని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. ‘మండలి’లో వ్యవసాయంపై మంగళవారం చర్చ సందర్భంగా నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణికి చెందిన కేసుల రికార్డులు ఏమయ్యాయంటూ ఎమ్మెల్సీ లోకేశ్ పెద్దపెద్ద కేకలు వేయడంతో మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఈ వ్యవహారంలో తాను సీబీఐ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు నివేదించానని గుర్తుచేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలుచేస్తే ఊరుకు నేది లేదని హెచ్చరించారు. ఆ సమయంలో విదేశీ వనితలతో స్విమ్మింగ్పూల్లో మద్యం తాగుతున్న లోకేశ్ ఫొటోలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రదర్శించారు. దీంతో లోకేశ్.. ‘ఎస్.. నేను మగాడ్ని.. ఇంకా బాగా పెద్దవిచేసి చూపించుకో..’ అంటూ గట్టిగా కేకలు వేశారు.
టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కాకాణి సవాల్
మరోవైపు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు ఒక్క ట్రాక్టర్ కూడా ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు చెప్పడాన్ని మంత్రి కాకాణి తప్పుబట్టారు. ‘మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ట్రాక్టర్లు ఇవ్వనట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా..’ అంటూ సవాల్ విసిరారు.
తొలుత చర్చను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో వ్యవసాయాన్ని దండగ అని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత వైఎస్సార్, ఆయన వారసుడు సీఎం జగన్ వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సంగం బ్యారేజీకి వైఎస్ శంకుస్థాపన చేస్తే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభిం చారని తెలిపారు. పోలవరానికి కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, సీఎం జగన్ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ హయాంలో రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడితే, జగన్ పాలనలో సుభిక్షంగా ఉందన్నారు. మళ్లీ ఈ చర్చపై మంత్రి కాకాణి మాట్లాడుతూ... రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు.