
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వేదికగా మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్పై కాంగ్రెస్ నేత మల్లు రవి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు.
కాగా, మల్లు రవి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని రాజకీయ వేదిక చేసి గుడి చుట్టూ రాజకీయాలు నడిపింది బీజేపీ కాదా?. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేసినప్పుడు బండి సంజయ్కు ఆత్మసాక్షి లేదా?. కాంగ్రెస్పై చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండవు. రాజకీయం కోసం అబద్ధాలతో గడుపుతున్నారు. బీజేపీ నేతలు చేసే ప్రతీ ప్రకటన అబద్ధాలతో కూడుకున్నది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు గత పదేళ్లుగా నడుస్తున్నవే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, అంతకు ముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ఈటల మాట్లాడుతూ.. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. అసలు రేవంత్తో తనకు పోలికేంటి అని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో మీరు జైలుకెళ్లారు.. మీతో నాకు పోలికా? ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశాను. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు.' అని ఈటల ఫైర్ అయ్యారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలకో కాంగ్రెస్కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే.