హైకోర్టు తీర్పు.. పది స్థానాల్లో ఉప ఎన్నిక ఖాయం: పాడి కౌశిక్‌ రెడ్డి | BRS MLA Padi Kaushik Reddy Serious Comments Over Congress | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పు.. పది స్థానాల్లో ఉప ఎన్నిక ఖాయం: పాడి కౌశిక్‌ రెడ్డి

Sep 9 2024 2:58 PM | Updated on Sep 9 2024 3:24 PM

BRS MLA Padi Kaushik Reddy Serious Comments Over Congress

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్..  రాష్ట్రానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, అసెంబ్లీ స్పీకర్‌ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.

కాగా, తాజాగా పాడి కౌశిక్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను, ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పీకర్‌కు సూచించింది. స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికి ఒక నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. హిమాచల్‌లో బీజేపీకి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.

కాంగ్రెస్ జాతీయ పార్టీలా లేదు.. 
కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదు. ఉప ప్రాంతీయ పార్టీలా వ్యవహరిస్తోంది. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపులపై ఎందుకు స్పందించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్యారెక్టర్‌ లేదు. రాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపులపై చెప్పిన మాటలను గౌరవించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. ఇపుడు హైకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. దానం నాగేందర్‌ను హైదరాబాద్ రోడ్లపై మేమే ఉరికిస్తాం.
రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ముతో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలా పది కోట్లు ఇచ్చి కొన్నారు. అన్ని వ్యవస్థలు పరస్పరం సహకరించుకుని పని చేయాలి. హైకోర్టు చెప్పింది శాసన సభాపతి పాటించాలని కామెంట్స్‌ చేశారు.

హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం..
మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం. మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. సీఎం ఆయనపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దు. కాంగ్రెస్ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలు వీడాలి. స్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది. అన్ని అసెంబ్లీలకు ఈ తీర్పు ప్రామాణికం కానుంది. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement