సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే.. సీఎం రేవంత్ మాత్రం ఆ నోటిఫికేషన్ వద్దంటున్నారని మండిపడ్డారు.
ఈరోజు(శనివారం, మే 5వ తేదీ) సిద్ధిపేట జిల్లా జిల్లా గ్రంధాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు హరీష్రావు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దంటున్నారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకువచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని నమ్మించారు.
ఆనాడు నమ్మించి..నేడు వంచించడం కాంగ్రెస్ నైజం. సెంట్రల్ లైబ్రరీలో పోలీసులతో నిరుద్యోగులపై రేవంత్ దాడి చేయిస్తున్నారు. BRS హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్ వచ్చాక భర్తీ చేసింది కేవలం 16 వేల ఉద్యోగాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. మిగిలిన 1.84 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలి.
పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పారు. మరి 5 వేల ఉద్యోగాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి..మిగతా 14 వేల పోస్టులను ఎందుకు ఆపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 40 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం. విద్యా కమిషన్ రిపోర్ట్ని సీఎం రేవంత్ ఎందుకు బయటపెట్టడం లేదు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి.
మెగా డీఎస్సీసీ కాస్త దగా డీఎస్సీ అయిపోయింది. రేవంత్ నీ డ్రామాలు బంద్ చేయి. చిల్లర మాటలు కాదు కావాల్సింది...జాబ్ నోటిఫికేషన్ కావాలి. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయి చిత్తు కాగితం అయింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?, నీ కోసం పని చేసిన నిరుద్యోగులే రేపు రేవంత్ని బొందపెడతారు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు.


