టీవీకే విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటు.. పరువు పోగొట్టుకుంటున్న గవర్నర్‌ | AICC Tamil Nadu in charge Girish Chodankar key comments about Governor | Sakshi
Sakshi News home page

టీవీకే విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటు.. పరువు పోగొట్టుకుంటున్న గవర్నర్‌

May 8 2026 2:49 PM | Updated on May 8 2026 2:55 PM

AICC Tamil Nadu in charge Girish Chodankar key comments about Governor

సాక్షి,చెన్నై: తమిళనాడు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ గిరీష్‌ చోడంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత  విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటులో తీసుకున్న నిర్ణయాల వల్ల తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ పరువు పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు.

తమిళనాడులో డీఎంకే–అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చోడంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే బెదిరిస్తున్నదని, కుట్రలో భాగంగా ఈడీ పేరుతో ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను వీడి అన్నాడీఎంకేలో చేరేది లేదని ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పష్టంగా తెలిపారు. బెదిరింపులు, భేరసారాసాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిలబడుతున్నారని, విజయ్‌కు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్‌ ముందుండి నడిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ రాజేంద్రపై తీవ్ర విమర్శలు గుప్పించిన చోడంకర్‌.. ‘దేశం ఎప్పుడూ చూడని విధంగా తమిళనాడు గవర్నర్‌ వ్యవహరిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వడం లేదు. టీవీకే కాకుండా ఇతర పార్టీలు సంఖ్యాబలం నిరూపిస్తే అవకాశం ఇస్తానని చెప్పి నవ్వులు పాలవుతున్నారు’ అని అన్నారు.

టీవీకేకు మద్దతు ఇవ్వాలని వీసీకేతో పాటు మరో రెండు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఆ మూడు పార్టీల నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement