గాల్లో ప్రాణాలు
శంకర్దాదాలు..
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు శంకర్దాదా ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. అర్హత ఉండదు.. అనుమతులు ఉండవు. అయినా వైద్య చికిత్సలు చేసేస్తుంటారు. అడిగే వారు లేకపోవడం, తనిఖీలు చేసేవారు ఆ విషయమే మరచిపోవడంతో ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత్యంతరం లేక స్థానికంగా అందుబాటులో ఉందనే ఉద్దేశంతో తమ వద్దకు వస్తున్న రోగులకు చుక్కలు చూపుతున్నారు. రోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ల వద్దనే ల్యాబ్, ఫార్మసీ ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలుచోట్ల ఆర్ఎంపీలు చేసిన వైద్యం వికటించి కొందరి ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్నారులు, బాలింతలు ఇబ్బంది పడిన ఉదంతాలూ వెలుగుచూశాయి. దీనికితోడు సమీప పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల వారితో ఆర్ఎంపీలు కుమ్మకై ్క రోగులను అక్కడికి పంపిస్తూ అడ్డగోలుగా ‘కమీషన్’ రూపంలో పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్ఎంపీల ఇష్టారాజ్యం
అర్హతకు మించి వైద్యం
అవగాహన లేకున్నా యాంటిబయోటిక్స్ ప్రిస్క్రిప్షన్స్
అమాయకుల ప్రాణాలతో చెలగాటం


