
ఆదర్శ పాఠశాల సందర్శన
ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయాన్ని గురువారం జిల్లా విద్యాధికారి మాధవి సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. టీచింగ్ డైరీ, సెలన్ ప్లాన్స్, పీరియడ్ ప్లాన్స్, బేస్లైన్ టెస్టుకు సంబంధించిన డైరీలను తనిఖీ చేశారు. విద్యాలయంలో నిర్వహిస్తున్న ఎఫ్ఎం రేడియో ప్రోగ్రాం, మంత్లీ మ్యాగ్జిన్ గురించి ప్రిన్సిపాల్ రాజ్కుమార్ డీఈవోకు వివరించారు. కాగా ఈ ప్రోగ్రాం కొత్త ఓరవడిని సృష్టించి విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుందని ప్రిన్సిపాల్ను డీఈవో అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ పాఠశాలలో ప్రవేశపెట్టాలని సూచించారు. మండల విద్యాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘ఎల్లంపల్లి’కి స్వల్ప ఇన్ఫ్లో
రామగుండం: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి క్రమంగా ఇన్ఫ్లో పెరుగుతోంది. నీటిపారుదలశాఖ అధికారులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.0655 టీఎంసీలున్నాయి. ప్రాజెక్టులోకి 3,665 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, హైదరాబాద్ మెట్రో 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీ 121 క్యూసెక్కులు ఔట్ఫ్లో చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సుందిళ్ల గ్రామస్తులకు ఎక్స్గ్రేషియా చెల్లింపు
గోదావరిఖని(రామగుండం): సింగరేణి మైనింగ్ లీజు భూముల ఎక్స్గ్రేషియా సుందిళ్ల రైతులకు చెల్లించామని ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన గ్రామస్తులకు చెక్కులు అందజేశారు. జీఎం మాట్లాడుతూ జీడీకే–5 ఓసీ పరిధిలోని సింగరేణి మైనింగ్ లీజు భూములను సుందిళ్ల గ్రామ రైతులు తాత్కాలికంగా కొంతకాలం జీవనోపాధి కోసం ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భూమిలో ఓసీపీ విస్తరణ పనులు చేపడుతున్న క్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు ఎక్స్గ్రేషియా అందజేస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి రూ.6.50లక్షల చొప్పున 16.04 ఎకరాలకు ఏడు చెక్కులు అందజేసినట్లు వెల్లడించారు. ఈ ఎక్స్గ్రేషియా చెల్లింపు పక్రియ కొనసాగుతుందన్నారు. ఎస్వోటూ జీఎం ఆంజనేయప్రసాద్, ప్రాజెక్ట్ అధికారి డి.రమేశ్, డీజీఎం సర్వే జీఎల్రాజు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, ఎస్టేట్ అధికారి సాంబశివరావు, లా ఆఫీసర్ అఫ్రిన్ సుల్తానా పాల్గొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్.. బడిలో చేరిక
కాల్వశ్రీరాంపూర్: మండలంలోని పెద్దరాతుపల్లి లోని చెంచు బాలికను గురువారం అధికారులు గుర్తించి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో చేర్పించారు. కార్మికశాఖ, పోలీసుశాఖ సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బడికి వెళ్లకుండా కూలీపనికి వెళ్తున్న బాలబాలికలను గుర్తించి బడిలో చేర్పిస్తున్నట్లు ఎంఈవో మహేశ్కుమార్ పేర్కొన్నారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీదేవి, సీఆర్పీలు కుమారస్వామి, చందర్, వీరయ్య, చంద్రకళ పాల్గొన్నారు.
అందుబాటులో ఉండాలి
మంథని: హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి వినోద్కుమార్ అన్నారు. గురువారం మంథనిలోని బాలుర కళాశాల హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టగా ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వార్డెన్ రమేశ్ను ఆదేశించారు. హాస్టల్లోని సమస్యలపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్, రాష్ట్ర కమిషనర్కు నివేదిక పంపడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఆదర్శ పాఠశాల సందర్శన

ఆదర్శ పాఠశాల సందర్శన