
చిన్నబోతున్న చెరువు
● జిల్లాలో చేపపిల్లల పంపిణీపై నీలినీడలు ● పథకం అమలుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ● నగదు అందజేస్తే తామే కొనుగోలు చేస్తామంటున్న మత్స్యకారులు ● సొసైటీలకు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదనలు
సాక్షి,పెద్దపల్లి: మత్స్యకార్మికులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వర్షకాలం ప్రారంభమై జూలై సమీపిస్తున్నా ఇంతవరకు ప్రభత్వం నుంచి ఎలాంటి స్పష్టత వెలువడలేదు. దీంతో అసలు ఈపథకం ఈ ఏడాది ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లోపే టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఎటువంటి కసరత్తు మొదలుపెట్టలేదు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయితే జూలై నుంచి సెప్టెంబర్ వరకు జలాశయాల్లో చేపలు, రొయ్య విత్తనాలను మత్స్య శాఖ అధికారులు సొసైటీల సహకారంతో వదలా ల్సి ఉంది. అయితే, సకాలంలో చేప విత్తనాల్ని వద లకుంటే ఆశించిన మేర ఎదిగే అవకాశం ఉండదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది మధ్యలోనే..
జిల్లాలో 281 మత్స్య సొసైటీలుండగా, అందులో 13,450 మంది సభ్యులు ఉన్నారు. గతేడాది అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులతోపాటు 1,073 చెరువులు, 79 కుంటల్లో 31లక్షల చేపపిల్లలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో పెద్దసైజ్ (80 మి.మీ. నుంచి 100 మి.మీ.) చేపపిల్లలను రిజర్వాయర్లు, చిన్నసైజ్(35 మి.మీ. నుంచి 40 మి.మీ.) చేపపిల్లలను కుంటలు, చెరువుల్లో వదలాలని నిర్ణయించారు. టెండర్లు ఆలస్యంగా పిలవడం, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చిన్నసైజ్ చేపపిల్లలను సరఫరా చేస్తుండడంతో మత్స్య కారులు వాటిని అడ్డుకున్నారు. దీంతో మొత్తంగా గర్రెపల్లి, సుల్తానాబాద్లో 1.30లక్షల చేపపిల్లలు పంపిణీ చేసి ఆ తర్వాత మధ్యలోనే వదిలేశారు. ఉచిత చేపపిల్లలకు బదులు నగదు విడుదల చేస్తే సొసైటీలు నాణ్యమైన చేపపిల్లలు కొనుగోలు చేస్తాయని, వాటిద్వారా తమకు అందుతాయని మ త్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తద్వారా పిల్లల ఉత్పత్తి పెరుగుతుందని, తమ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని చెబుతున్నారు. అదనుదాటిన తర్వాత నిర్ణయం తీసుకోకుండా, అదనులోపే ప్రభుత్వం ఈపథకం అమలుపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, చేపపిల్లల పంపిణీ ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం పథకం అమలుపై ఆచూతూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. జిల్లామత్స్యకార అధికారి నరేశ్ నాయుడును ఈ విషయంపై వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

చిన్నబోతున్న చెరువు