
మొరాయిస్తున్న అంబులెన్స్లు
● అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు ● ప్రైవేట్ వాహనాలే దిక్కవతున్న వైనం ● పట్టించుకోని సింగరేణి అధికారులు
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనులపై అందుబాటులోకి తీసుకొచ్చిన అంబులెన్స్లు ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. అత్యవసర సమయాల్లో కార్మికులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు వివిధ కారణాలతో మొరాయిస్తున్నాయి. ఆపదలో ఉన్న ఉద్యోగులు గోల్డెన్ ఆవర్లో ఆస్పత్రికి చేర్చడం అత్యంత కీలకం. ఈక్రమంలో గురువారం జీడీకే–11గనిలో పనిచేస్తున్న ఉద్యోగురాలు చాతీ నొప్పితో ఆస్వస్థతకు గురైంది. దీంతో గనిపై ఉన్న అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేందుకు సమాయత్తం చేయగా అది స్టార్ట్కాలేదు. దీంతో గనిపై ఉన్న ఓ బొలేరో వాహనంలో సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం ప్రతీ మైన్పై అంబులెన్స్ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. అయితే గనిపై అంబులె న్స్ ఏర్పాటు చేసినప్పటికీ అది కండీషన్లో లేకపోవడంతో అవసరానికి ఉపయోగ పడడం లేదని, ఉద్యోగులు, కార్మికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
రెండు సంఘటనల్లో ఇబ్బందులు
ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఈనెల 24న అండర్గ్రౌండ్ ఎల్హెచ్డీ సెక్షన్లో గ్రూప్ ఇంజినీర్ రాందాస్ అస్వస్థకు గురయ్యారు. అత్యవసరంగా ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. గనిపై ఉన్న అంబులెన్స్ మొరాయించడంతో బొలెరో వాహనంలో బాధితుడిని సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈనెల 26న ఉదయం7గంటల షిఫ్ట్లో కంటిన్యూస్ మైనర్–2లో పనిచేస్తున్న మహిళా ట్రెయినీ ఫిట్టర్ చాతిలో నొప్పి వస్తుందని అధికారులకు చెప్పారు. ఆమెను వెంటనే అండర్ గ్రౌండ్ నుంచి గనిపైకి తీసుకొచ్చి అంబులెన్స్లో తరలించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో బొలేరో వాహనంలో ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హార్ట్ ఎటాక్లు ఎక్కువ అవుతున్నాయని, గనిపై అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కండిషన్లో ఉన్న అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
కండీషన్లోనే ఉండాలి
కండీషన్లో ఉన్న అంబులెన్స్లను గనిపై ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు తుమ్మల రాజారెడ్డి, మెండె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అత్యవసర సమయాల్లో పనిచేయని అంబులెన్స్లు గనిపై ఉండి ఏం ప్రయోజనమని వారు ప్రశ్నించారు.