
ఫలించిన నిరీక్షణ
● ఎట్టకేలకు 200 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ● 35–40 ఏళ్ల వయసుగల కార్మిక వారసులకు ప్రయోజనాలు ● నియామకపత్రాలు అందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గోదావరిఖని: సుదీర్ఘకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సింగరేణి కార్మిక వారసుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 35 ఏళ్ల – 40ఏళ్ల వరకు వయోపరిమితి పెంచడంతో సుమారు 200 మందికి సింగరేణి సంస్థలో ఉద్యోగావకాశాలు లభించాయి. దీంతో డిపెండెంట్లతోపాటు వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
యూనియన్ల పోరాట ఫలితం..
కారుణ్య నియామకాల ద్వారా నియమితులయ్యే కార్మిక వారసులకు వయోపరిమితి ఇంతకాలం ఉద్యోగాలు రాకుండా అడ్డుపడింది. 35 ఏళ్ల నుంచి 40ఏళ్ల వయసు ఉండడంతో నిబంధనలు అంగీకరించవని ఇన్నాళ్లూ యాజమాన్యం కారుణ్య నియామకాలకు ససేమిరా అంది. అయితే, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పోరాటం.. రాష్ట్రప్రభుత్వ జోక్యంతో డిపెండెంట్ల వయో పరిమితి పెంచుతూ సింగరేణి సీఎండీ బలరాం ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత శనివారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేతుల మీదుగా డిపెండెంట్లకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఉ ద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సుమా రు 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో డిపెండెంట్ల వయసు పెంచడంతో చాలామంది వారసులకు ఉద్యోగావకాశాలు దరిచేరాయి.
కోవిడ్ మహమ్మారితో వయోపరిమితి సమస్య..
కోవిడ్ మహమ్మారితో రెండేళ్లపాటు కారుణ్య నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చాలామంది డిపెండెంట్ల వయసు 35ఏళ్లు దాటిపోయింది. ఫలితంగా ఇలాంటివారు ఉద్యోగానికి అనర్హులుగా మారారు. కోవిడ్ మహమ్మూరితో ఉద్యోగాలు నష్టపోయే దుస్థితి ఏర్పడిందని డిపెండెంట్ల కుటుంబాలు ఆవేదన చెందాయి. సమస్యను గుర్తించిన సింగరేణిలోని కార్మిక గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి. ఇదేవిషయంపై రాష్ట్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. 35–40ఏళ్ల వయసు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంలో కీలకంగా వ్యవహరించింది.
200 మందికి ప్రయోజనం..
కారుణ్య ఉద్యోగాల్లో గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడంతో సంస్థవ్యాప్తంగా 200 మంది కార్మిక వారసులకు ప్రయోజనం చేకూరుతోంది. వయోపరిమితి పెరిగి ఉద్యోగాలు రావనే బెంగతో ఉన్న డిపెండెంట్ల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిస్తోంది.
సంతోషంగా ఉంది
వయోపరిమితి 40ఏళ్లకు పెంచడం సంతోషంగా ఉంది. మా నాన్న జీడీకే–11గనిలో సపోర్ట్మెన్గా పనిచేసి మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా దిగిపోయారు. ఆ తర్వాత డిపెండెంట్గా జాబ్కు ఓకే అయినా.. అప్పటికే నాకు 35ఏళ్లు దాటిపోయాయి. దీంతో ఉ ద్యోగం ఇక రాదని ఆందోళనగా ఉన్నాం. ఈ లోగా సర్క్యులర్జారీ చేసి ఉద్యోగ నియామ కపత్రం అందుకోవడం సంతోషంగా ఉంది.
– ఇగుర్ల రజిత, డిపెండెంట్

ఫలించిన నిరీక్షణ