
అప్పు తీసుకున్న వారు మోసం చేశారని..
జగిత్యాలక్రైం: మాయమాటలు చెప్పి అవసరం నిమిత్తం బంగారం, నగదు తీసుకున్న ఇద్దరు మహిళలు ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పుకుంటుండడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన తోట బాలవ్వ వద్ద జగిత్యాలకు చెందిన అశ్విని, మల్యాల మండలం రామన్నపేటకు చెందిన విజయ ఇద్దరూ కలిసి తమ అవసరం నిమిత్తం 14 నెలల క్రితం 15 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకుని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. కాలపరిమితి ముగియడంతో బాలవ్వ డబ్బులు చెల్లించాలని కోరగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీంతో గతంలోనే బాలవ్వ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ముందు కూడా వారు డబ్బులు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. బుధవారం డబ్బులు చెల్లించేందుకు వాయిదా ఉండటంతో బాలవ్వ పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుంది. పోలీసులు అశ్విని, విజయను పిలిపించారు. వారు డబ్బులు చెల్లించేందుకు కొంతసమయం కావాలని, ఇప్పుడే కావాలంటే తమ వద్ద లేవని నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలవ్వ వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగింది. అక్కడున్న వారు గమనించి బాలవ్వను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలవ్వ చికిత్స పొందుతోంది.
పోలీస్స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రికి తరలించిన పోలీసులు