
మెరుగుపడింది
● గతేడాదితో పోల్చితే కాస్త పెరిగిన ఉత్తీర్ణ శాతం ● ఈసారి కూడా అగ్రస్థానంలో నిలిచిన బాలికలు ● ఫస్టియర్లో 62.45 .. సెకండియర్లో 70.03 శాతం ఉత్తీర్ణత నమోదు ● ఇంటర్లో బాలుర వెనుకంజ
సాక్షి, పెద్దపల్లి/సుల్తానాబాద్ : ఇంటర్ ఫలితాల్లో జిల్లాస్థానం ఈసారి కాస్త మెరుగుపడింది. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 31వ స్థానంలో నిలవగా, తాజా ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో జిల్లా 11వ స్థానం, ఫస్ట్ఇయర్లో 12వ స్థానం సాధించి ఫలితాలు మెరుగుపర్చుకుంది. ప్రథమ సంవత్సరంలో 62.45శాతం, ద్వితీయ సంవత్సరంలో 70.03 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో మంథని బాలికల కళాశాల విద్యార్థిని శ్రీజ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 మార్కులకు 465 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. సెకండియర్ ఎంపీసీ గ్రూప్లో సుల్తానాబాద్ ప్రభుత్వ జానియర్ కాలేజీకి చెందిన విద్యార్థి నవీన్కుమార్ 980 మార్కులతో, గోదావరిఖని జూనియర్ కాలేజీకి చెందిన కె.స్ఫూర్తి హెచ్ఈసీలో 978 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. రాఘవాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలిక జూనియర్ కాలేజీ విద్యార్థి నల్ల హర్షిత బైపీసీలో 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది.
సత్తా చాటిన బాలికలు..
ఎప్పటిలాగే ఇంటర్ ఫలితాల్లో బాలురుపై బాలికులు ఈసారి కూడా పైచేయి సాధించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్స్లో కలిపి 4,487 మంది బాలికలకు గాను 75.66 శాతంతో 3,395 మంది విద్యార్థినులు పాసయ్యారు. 3,137 మంది బాలురు పరీక్ష రాయగా 52.72 శాతంతో 1,654 మంది ఉత్తీర్ణులయ్యారు.
వొకేషనల్ ఫలితాలు ఇలా..
వొకేషనల్ సెకండియర్లో 918మందికి 700మంది 76.25శాతంతో ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ ప్రైవేట్లో 168 మందికి 91 మంది 54.17శాతంతో పాసయ్యారు. ప్రైవేట్లో సెకండియర్లో 751 మందికి 278 మంది(37.02)శాతం పాసయ్యారు. ఫస్ట్ ఇయర్ వొకేషనల్లో 1,069మందికి 650 మంది ఉత్తీర్ణులై 60.80 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.
ప్రభుత్వ కళాశాలల సత్తా..
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ జూనియ ర్ కాలేజీల విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటా రు. జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఫస్టియర్ విద్యార్థులు 95.38శాతంతో కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ అగ్రస్థానంలో ఉండగా ఆఖరున 15.79 శాతంతో ధర్మారం ప్రభుత్వ కాలేజీ ఉంది. సెకండియర్ ఫలితాల్లో రామగుండం 88.1శాతంతో టాపర్గా నిలవగా, 33.1శా తంతో గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కా లేజీ వెనుకబడింది. అలాగే వొకేషనల్ కోర్సు ల్లో ఫస్టియర్లో రామగుండం కాలేజీ విద్యార్థులు 85.19శాతంతో టాపర్గా నిలవగా, 40.29శాతంతో పెద్దపల్లి కాలేజీ చివరన ఉంది. అలాగే సెకండియర్లో రామగుండం ప్రభుత్వ కాలేజీ 96శాతం ఉత్తీర్ణత సాధించగా ధర్మారం 55.2శాతం సాధించింది.
బాలురు, బాలికల వారీగా ఫలితాలు
సంవత్సరం విద్యార్ధులు హాజరు ఉత్తీర్ణత శాతం
ఫస్ట్ఇయర్ బాలురు 1,558 759 48.72
ఫస్ట్ఇయర్ బాలికలు 2,269 1,631 71.88
సెకండ్ ఇయర్ బాలురు 1,579 895 56.68
సెకండ్ ఇయర్ బాలికలు 2,218 1,764 79.53