
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
అనర్హులకిస్తే..అధికారులపై చర్యలు తప్పవు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం
వానాకాలం ఎరువులు, విత్తనాల కొరత రాకూడదు
కలెక్టర్లు మరోవారంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి
హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు.
‘ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం. ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం.
కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తాం.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తాం. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది’ అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్లు మరోవారం పాటు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలని అన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.
ఇండ్ల స్థలాలపై ఆందోళన వద్దు..
మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతే నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లాల కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను మంత్రి కోరారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయరమణారావు, డాక్టర్ సంజయ్కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్యప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.