
జ్యోతినగర్: రామగుండం నియోజకవర్గం పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేశ్ రాణా, ఆర్వో అరుణశ్రీ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సీఆర్పీఎఫ్ భద్రత బలగాలు, పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా ఉంటూ అసాంఘిక కార్యక్రమాలు, ఎన్నికల ఉల్లంఘన చర్యలను నివారించాలని సూచించారు. 56వ పోలింగ్ కేంద్రంలో ఆర్వో అరుణశ్రీ ఓటు హక్కు వినియోగించుకొని బీఎల్వో, ఆశా వర్కర్లు, పోలీసులను అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అలాగే రామగుండం మున్సిపల్ కమిషనర్ సీహెచ్. నాగేశ్వర్, ఏఆర్వో కుమారస్వామి, స్వీప్ జిల్లా నోడల్ అధికారి రావూఫ్ ఖాన్, స్వీప్ రామగుండం నోడల్ అధికారి స్వరూపరాణి, మీడియా అండ్ కమ్యూనికేషన్ ప్లాన్ నోడల్ అధికారి రజినితో పాటు పలువురు అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఆకట్టుకున్న ‘నా ఓటు నా హక్కు’ రంగవల్లి
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్లోని 56వ పోలింగ్ స్టేషన్ వద్ద ఆర్పీ స్వప్న వేసిన నా ఓటు నా హక్కు రంగవల్ల్లిక పలువురిని ఆకట్టుకుంది. హిందీలో మేరా ఓటు మేరా అధికార్ అనే పదాలు, ముగ్గులో జాతీయ పతాకం, ఎలక్షన్ కమిషన్ లోగో, నెమలి ిపింఛన్తో రంగవల్లిక టౌన్షిప్లోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులను ఆకట్టుకున్నాయి.
ఈవీఎంల మొరాయింపు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు మండలాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొంతసేపు పోలింగ్ బూత్ ఆవరణలోనే నిరీక్షించారు. పెద్దకల్వలలోని 74వ పోలింగ్ బూత్, భోజన్నపేటలోని 86వ బూత్తో పాటు ఓదెల మండలం కొమిరెలోని 167, ఎలిగేడు మండలం లాలపల్లిలోని 266 బూత్లలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలింగ్ కొనసాగించారు. ఈవీఎంలు పనిచేయక పోవడంతో ఓటర్లు కొంత అసహనానికి గురయ్యారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
మంథని: మంథని మండలం వెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ఎదుట దిగిన కాంగ్రెస్ నాయకులు క్యూ లైన్ పాటించడం లేదని బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మద్య తోపుబాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అలాగే ఎక్లాస్పూర్ కేంద్రంలో క్యూలైన్లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణ పడ్డారు.
ప్రలోభపెట్టిన అధికారులపై ఫిర్యాదు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంథని మండలం నాగారం, మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేటలో పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఓ పార్టీకి ఓటు వేయాలని ప్రలోభపెడుతున్నారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఘర్షణ పడుతున్న నాయకులు

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న రాజేశ్ రాణా

పోలింగ్ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న ఓటర్లు