బొబ్బిలి రూరల్: మండలంలోని ఎం. బూర్జివలస గ్రామానికి చెందిన పిట్ట అప్పలనాయుడు (36) ప్రమాదవశాత్తూ సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో సహా ఈ నెల 21న దైవ దర్శనానికి తిరుమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 24న రాత్రిపూట బొబ్బిలి రైల్వేస్టేషన్గా భావించి రాజమండ్రి స్టేషన్లో దిగిపోయాడు. బొబ్బిలి చేరుకున్న కుటుంబ సభ్యులు అప్పలనాయుడు దిగకపోవడంతో వెంటనే ఫోన్ చేయగా.. తాను పొరపాటున రాజమండ్రిలో దిగిపోయానని, ప్రస్తుతం మరికి వద్ద ఉన్నానని చెప్పాడు. వెంటనే మరికి వెళ్లిన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతగ్గా ఫోన్ పనిచేయకపోవడం, ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు తెలిపారు. పోలీసులు అతని ఆచూకీ కోసం గాలించగా వాడపల్లి సమీపంలోని సాగునీటి కాలువలో శవమై కనిపించాడు. అప్పలనాయుడు మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. శవపంచనామాను పూర్తిచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజమండ్రిలో దిగిన వ్యక్తి వాడపల్లి వైపు ఎందుకు వెళ్లాడో అర్థం కావడం లేదని.. ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అప్పలనాయుడు మృతదేహానికి సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. మృతుడికి భార్య పోలమ్మ, తొమ్మిదేళ్ల కుమారుడు శివ ఉన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి ..
గజపతినగరం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని భైరిపురం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తుమ్మికాపల్లికి చెందిన ఆకుల ఏడుకొండలు తన సోదరి వివాహం నిమిత్తం వస్తువులు కొనుగోలు చేసేందుకు భైరిపురం జంక్షన్కు వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా.. సెంట్రల్ లైటింగ్ బాక్సుకు సంబంధించిన విద్యుత్ తీగ అతనికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


