పాలకొండ రూరల్: మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు.
● ఈ నెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి ఈ ఏడాది 10,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 15 మండలాల పరిధిలో 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 99 మంది ఉన్నారు. వీరి సౌకర్యార్థం మార్కుల్లోనూ మార్పులు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
● శారీరకంగా దివ్యాంగులైన విద్యార్థులకు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్ష రాయకుండా మినహాయింపు కల్పించారు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
● కంటిచూపు సరిగా లేని విద్యార్థులకు ఒక లాంగ్వేజ్ పరీక్ష మినహాయింపుతో పాటు మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు రావాలి.
● వినికిడి లోపం గల వారు రెండు లాంగ్వేజ్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందాలి.
● మాట లోపం గలవారు ఒక్కో సబ్జెక్ట్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యసనా వైకల్యం గల విద్యార్థులకు ఆంగ్లం మినహా మిగిలిన సబ్జెక్ట్ల్లో 15 మార్కులు పొందాల్సి ఉంటుంది.
● ఈ తరహా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద వీల్చైర్లు, ర్యాంపులు, వైద్య పరమైన సేవలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సదరు విద్యార్థులు సహాయకుల కోసం (స్రైబ్) దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
డీఈఓ బ్రహ్మాజీరావు


