జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పీడమండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా జ్వరంతో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అనారోగ్యానికి గురైన సాయి సార్వినిని పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి కుటుంబ సభ్యులు మంగళవారం తీసుకురాగా వైద్యులు పరీక్షించారు. పరిస్థితిని గమనించి చిన్నారిని విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. అయితే చిన్నారికి సరైన వైద్యం అందడం లేదని తల్లిదండ్రులు కొండగొర్రె నూకందొర, జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కొన్నాళ్లుగా పాఠశాలకు రాకపోవడంతో సాధారణ జ్వరమేనని పాఠశాల సిబ్బంది అనుకున్నారు. ఆరా తీయగా మలేరియాగా గుర్తించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సార్వినిని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య విషయమై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని గిరిజన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


