విజయనగరం అర్బన్: ఉత్తమ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ఉద్యోగుల రక్షణకు శ్రీరామరక్షగా ఉంటుందని ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా తరగతులకు గురువారం హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూఏ ఉద్యోగులకు బలపరుస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం, యూనియన్ బలోపేతానికి ఇదే ప్రధాన మార్గమని తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తరువాత వచ్చిన మార్పులు, వాసా రూల్స్ ప్రకారం జారీ అయిన జీవోలలో ఉన్న మార్పులను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఎన్ఎంయూఏను రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 96 ద్వారా గుర్తింపు సంఘంగా ప్రకటించిందని అలాగే జీవో నెంబర్ 129 ద్వారా స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించి ఉద్యోగుల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. అందువల్ల ప్రతి ఉద్యోగి సర్క్యులర్లు తెలుసుకుని యాజమాన్యంతో సంప్రదింపులు జరిపేటప్పుడు సర్క్యులర్ ప్రకారం మెమోరాండం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి, కోశాధికారి పీవీమోహన్, జోనల్ అధ్యక్షుడు బీఎస్రాములు, జోనల్ కార్యదర్శి ప్రదీప్కుమార్, జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్ తదితరులు పాల్గొన్నారు. జోన్ పరిధిలోని 18 డిపోల ముఖ్య నాయుకులు, వర్క్షాప్ నాయకులు కూడా హాజరయ్యారు.
ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్


