● కాలిబూడిదైన వరి గడ్డివాములు
● పాక్షికంగా కాలిపోయిన ఆవు
● రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం
లక్కవరపుకోట: మండలంలో గొల్జాం గ్రామ సమీపంలోని జామివారి కల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరు గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదవగా ఒక ఆవు పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులు, వీఆర్ఓ గణేష్ తెలిపిన వివరాలు.. జామి వారి కల్లాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మండ వెంకటరావు, తూర్పాటి సూర్యప్రకాష్, తూర్పాటి కనకమహేశ్వరరావు, తూర్పాటి విజయరామగణపతి, తూర్పాటి నీలకంఠం, తూర్పాటి కోటేశ్వరరావులకు చెందిన ఆరు గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి ప్రమాద స్థలానికి వెళ్లే దారి లేకపోవడంతో మిన్నకున్నారు, చెంతనే గల గెడ్డలో నీటి ఇంజిన్లు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద పైప్లతో రైతులే మంటలను అదుపు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో తూర్పాటి నీలకంఠంకు చెందిన ఒక ఆవు పాక్షికంగా కాలిపోయింది. కాగా వేసవి కాలం ప్రారంభంలోనే పలు గ్రామాల్లో ఇప్పటికే జరిగిన అగ్నిప్రమాదాలతో గడ్డివాములు కాలిపోయాయి. వరుస ప్రమాదాలు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.


