సాలూరు రూరల్: హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ను, అసెంబ్లీని ముట్టడిస్తామని షెడ్యూల్డ్ ఏరియా న్యాయపోరాట సభలో గిరిజన నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని జగ్గుదొరవలస గ్రామంలో షెడ్యూల్డ్ ఏరియా న్యాయపోరాట సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు నిమ్మక జయరాజు, నిమ్మక సింహచలం, మండల గిరిధర్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో షెడ్యూల్డ్ గ్రామాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. షెడ్యూల్డు ఏరియా భూభాగాల జాబితాను వెంటనే అధికార వెబ్సైట్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే, మంత్రులు నివాసాల వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు నిమ్మక అన్నారావు, మంచాల ఈశ్వరరావు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.


