● మాదలింగి పీహెచ్సీలో కనిపించని డాక్టర్లు, సిబ్బంది ● ఆస్పత్రికి వచ్చే రోగులకు దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు
కొమరాడ: మండలంలోని మాదలింగి పీహెచ్సీ లో పేదలకు వైద్యం అందని దైన్యంలా మారింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందే వైద్యుల అవతారం ఎత్తుతు న్నారు. కొరిశీల గ్రామానికి చెందిన రెండో తరగతి విద్యార్థి పాలక హర్షకు తీవ్ర జ్వరం రావడంతో తండ్రి రాజేష్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు కూడా అందుబాటులో లేరు. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో ఓ ఏఏన్ఎం మాత్రలు ఇచ్చి చికిత్స అందించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బాలుడి తండ్రి ఆస్పత్రిలో కనీసం ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో ఉండరా అని ప్రశ్నించారు. నర్సులే వైద్యులుగా వ్యవహరిస్తున్నారని, ల్యాబ్ పరీక్షలు చేసే సిబ్బంది కూడా సక్రమంగా లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. దీనిపై ఆస్పత్రి వైద్యాధికారిణిని వివరణ కోరగా.. దలైపేట గ్రామంలో ఓ రోగికి ఎమర్జెన్సీ అని ఆశ వర్కర్ ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.


