చివర్లో ఎందుకీ పరుగు..!
వీరఘట్టం: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఫిబ్రవరి 28 నుంచే ఈ ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. అకస్మాత్తుగా ఆదేశాలు జారీ కావడంతో ఎక్కడా మొదలు కాలేదు. మార్చి 2 నుంచి యథావిధిగా తనిఖీలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇదే రోజు నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు, 10వ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు, మార్చి 16 నుంచి పది పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో ఉన్నతాధికారులు బృందాలను పంపిస్తుండడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
ప్రణాళిక లేని పద్ధతులు
విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు అస్తవ్యస్థంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే 9వ తరగతి విద్యార్థులకు మార్చి నెలాఖరుకు సిలబస్ పూర్తి చేసి ఏప్రిల్లో ఫైనల్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకు విరుద్ధంగా సిలబస్ పూర్తి కాకుండానే మార్చి 2 నుంచి ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుండటంపై టీచర్లు మండిపడుతున్నారు. సిలబస్ పూర్తికానపుడు విద్యార్థులు పరీక్షలు ఎలా రాయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రణాళిక లేని పద్ధతులతో సర్కారు విద్య నిర్వీర్యం అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
జంబ్లింగ్ విధానంలో
తనిఖీ బృందాలు ఏర్పాటు
వీరఘట్టం మండలంలోని ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసేందుకు సీతానగరం, గుమ్మలక్ష్మీపురం ఎంఈఓలను నియమించారు. ఇలా వేర్వేరు మండలాల ఎంఈఓలు వేర్వేరు మండలాల్లో తనిఖీలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. వీరు ఫిబ్రవరి 28 నుంచి తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ సమాచారం ఆలస్యం కావడంతో సోమవారం నుంచి మార్చి 7 వరకు జిల్లాలోని 183 ఉన్నత పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నట్టు పలువురు ఎంఈఓలు తెలిపారు.
తనిఖీ చేయనున్న అంశాలు ఇవే..
ప్రతీ ఉన్నత పాఠశాలలో ముస్తాబు అమలు, ప్రాంగణ పరిశుభ్రత, 6–10వ తరగతుల బోధన స్థితి, సిలబస్ ఎంత వరకు పూర్తయింది, ఎస్ఎస్సీ–2026 యాక్షన్ ప్లాన్ అమలు, మధ్యాహ్న భోజన పథకం, కిచెన్ గార్డెన్ నిర్వహణ, ఆట స్థలాలు, క్రీడల పరిస్థితి, పాఠశాల రికార్డులు, పిల్లల హాజరు పట్టీలు పరిశీలించేలా తనిఖీ బృందాలకు జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకే తనిఖీలు చేపడుతున్నాం. టెన్త్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వారికి తగిన గైడ్లైన్స్ ఇస్తారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేసేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుంది.
– పి.బ్రహ్మాజీరావు, డీఈఓ,
పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లాలో 183 ఉన్నత పాఠశాలల్లో తనిఖీలకు రంగం సిద్ధం
ఉప విద్యా శాఖ, ఎంఈఓ, సమగ్ర శిక్ష అధికారులతో ఏడు బృందాలు
పరీక్షల వేళ ఏమిటీ గందరగోళమని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు


