కౌలు రైతులకు కార్డులివ్వాలి
● కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు
పార్వతీపురం రూరల్: భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన సంఘం మూడవ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బెలగాం సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 60 వేల మంది కౌలు రైతులు ఉండగా, కేవలం 700 మందికే కార్డులు అందాయని పేర్కొన్నారు. 2019 నాటి కౌలు చట్టాన్ని రద్దు చేసి, సాగుదారులకు మేలు చేసేలా కొత్త చట్టం తీసుకురావాలన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల పెట్టుబడి సాయం, పంట రుణాలు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జంఝావతి వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సభలో రైతు సంఘం నాయకులు ఎం.కృష్ణమూర్తి, బంటు దాసు, గంగునాయుడు సంఘీభావం తెలిపారు.
నూతన కమిటీ ఎన్నిక
మహాసభలో 11 మందితో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డి వేణు, కార్యదర్శిగా ఆర్.రమణమూర్తి, ఉపాధ్యక్షురాలిగా పి.దమయంతి, సహాయ కార్యదర్శిగా రెడ్డి ఈశ్వరరావు, కోశాధికారిగా ఆవు సాంబమూర్తి ఎన్నికయ్యారు.


