రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని పాతబగ్గాం గ్రామానికి చెందిన పల్లి ప్రసాద్ శనివారం తెల్లవారుజామున కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో ప్రమాదవశాత్తు లారీ నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... లారీ క్లీనర్గా పని చేస్తున్న ప్రసాద్ సాలూరు నుంచి లారీ లోడ్తో శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. గుడివాడ సమీపానికి వచ్చేసరికి క్లీనర్ సమీపంలో ఉన్న డోరు ఓపెన్ కావడంతో నిద్రమత్తులో ఉన్న ప్రసాద్ ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాడు. ఈ క్రమంలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ గమనించి వెనక్కి రాగా అప్పటికే ప్రసాద్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పల్లి రాము, దేవుడమ్మ కన్నీటి పర్యాంతమయ్యారు. దీంతో పాతబగ్గాంలో విషాదం అలుముకొంది. ప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి..
గుమ్మలక్ష్మీపురం: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన విద్యార్థి బిడ్డిక రాహుల్ (13) విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మలక్ష్మీపురం మండలం గాజులగూడ గ్రామానికి చెందిన రాహుల్ సమీపంలో గల కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇంటికెళ్లిన రాహుల్ స్నేహితులతో కలిసి ఈ నెల 26న బొద్దిడి జంక్షన్ వద్ద జరిగిన జాతరకు ద్విచక్ర వాహనంతో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వస్తుండగా డుమ్మంగి సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో రాహుల్ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ముఖం, తల భాగాల్లో గాయాల పాలైన రాహుల్ను సమాచారం అందుకున్న కుటుంబీకులు భద్రగిరి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అనంతరం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందినట్టు తల్లిదండ్రులు వనిత, అర్జున్ తెలిపారు.
శతాధిక వృద్ధురాలు..
బాడంగి: మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఇజ్జాడ పోలమ్మ(105) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆమె కుటుంబం మునిమనవులు, ముని మనవరాళ్లుతో ఉంది. పోలమ్మ అంత్యక్రియలు శనివారం ఆమె స్వగ్రామం గొల్లాదిలో జరిగాయి.
రామభద్రపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. ఎస్సై వెలమల ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24న తారాపురం అయ్యప్పస్వామి ఆలయం వద్ద పాచిపెంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన పి.శ్రీనివాస్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ను సాలూరు సీహెచ్సీకి తరలించగా అక్కడి నుంచి వైద్యులు విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రసాదరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


