కష్టపడి పని చేసే వారికి గుర్తింపు
● వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
బలిజిపేట: ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) సమక్షంలో, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో అజ్జాడకు చెందిన అక్కేన ఎల్లంనాయుడు, కాగాన అప్పలనాయుడు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన బలిజిపేట మండల మాజీ మండల ఉపాధ్యక్షురాలు అక్కేన చెల్లెమ్మ భర్త ఎల్లంనాయుడు, అజ్జాడ ఉప సర్పంచ్ కాగాన అప్పలనాయుడులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం అందరితో కలిసి కష్టపడి పని చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, పి.చాకరాపల్లి సర్పంచ్ కె.మోహనరావు, యువజన విభాగం బలిజిపేట మండలం అధ్యక్షుడు రణదేవ్ లక్ష్మణరావు, ఉమ్మడి జిల్లా పార్టీ సీనియర్ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


