ఎట్టకేలకు పట్టుబడిన హిట్ అండ్ రన్ వాహనం
● సాంకేతికత ఉపయోగిస్తూ పట్టుకున్న పోలీసులు
రామభద్రపురం: గత నెల జనవరి 25వ తేదీన ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన వాహనాన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సాంకేతికత ఉపయోగిస్తూ ఎస్ఐ వి.ప్రసాదరావుతో కూడిన పోలీసు బృందం చత్తీస్ఘడ్లో పట్టుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా శ్రీరాంనగర్కాలనీ వద్ద గత నెల 25వ తేదీ రాత్రి ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో రామభద్రపురానికి చెందిన మామ, అల్లుళ్లు మైనాపు తాతయ్య, బత్తిన అప్పారావు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే సరిగ్గా నెల రోజుల్లో పోలీసులు సీసీ పుటేజీలు ద్వారా చత్తీస్ఘడ్లోని స్వస్తిక్ మినరల్స్ కంపెనీకి చెందిన లారీగా గుర్తించారు. పోలీసు బృందం చత్తీస్ఘడ్ వెళ్లి అక్కడ యాజమాన్యానికి నోటీసు ఇచ్చి బుధవారం లారీని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చత్తీస్ఘడ్లోని స్వస్తిక్ మినరల్స్ కంపెనీకి చెందిన లారీని గత నెల 23వ తేదీన బొగ్గులోడుతో విశాఖపట్టణంలో అన్లోడు చేయడానికి డ్రైవర్ చోటీలాల్ బయలుదేరాడు. అదే నెల 25వ తేదీన రామభద్రపురం పోలీస్స్టేషన్కు ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న అల్లుడు, మామలను ఢీ కొట్టి ఆపకుండా విశాఖపట్టణం వెళ్లిపోయాడు. అక్కడ బొగ్గు అన్లోడు చేసి తిరిగి 27వ తేదీనాటికి చత్తీస్ఘడ్లోని స్వస్తిక్ మినరల్స్ కంపెనీకి లారీ వదిలేసి డ్రైవర్ చోటీలాల పరారయ్యాడు. సీసీ పుటేజీల ద్వారా లారీని గుర్తించిన పోలీసులు లారీ స్వాధీనం చేసుకుని పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.


