
జీతాల్లేవు...!
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
జూన్ నెలలో పాఠశాలల పునఃప్రారంభానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. బదిలీల ప్రక్రియను సజావుగా...
పారదర్శకంగా చేశామని చెప్పుకున్న కూటమి సర్కార్
బదిలీలైన ఉపాధ్యాయులకు జీతాలు వేయడంలో తీవ్ర
అలసత్వం ప్రదర్శిస్తోంది. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతం నేటి వరకు అందలేదు. జూలై నెల జీతం కూడా అందే పరిస్థితి లేదు. బదిలీల జరిగిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడమే దీనికి కారణం. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు అధికారుల అలక్ష్యం కూడా తోడైందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
పార్వతీపురం టౌన్: మన్యం జిల్లాలో వందల సంఖ్యలో ఉపాధ్యాయులకు జూన్ జీతాలు అందలేదు. ఇదేం చోద్యమోగాని ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు అందని పరిస్థితి కూటమి సర్కార్లోనే చూస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల వేర్వేరు పాఠశాలలకు, మోడల్ పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాల సమస్య నెలకొంది. కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో పాటు విద్య, ట్రెజరీ శాఖల సమన్వయ లోపంతోనే ఉపాధ్యాయులకు ఈ పరిస్థితి దాపురించింది. తమ జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు..
ఇదిలా ఉంటే బదిలీ అయిన ప్రాంతానికి ఉపాధ్యాయులు వారి కుటుంబాలతో వెళ్లేందుకు సిద్ధపడి వెళ్లారు. ఈ క్రమంలో రవాణా ఖర్చులు, ఇంటి అద్దె, అడ్వాన్స్ రూపంలో ఎక్కువగా ఖర్చు పెట్టారు. మరోవైపు జూన్ నెల కావడంతో పిల్లల స్కూలు ఫీజులు, విద్యా సామగ్రి వంటి ఖర్చులు ఎక్కువయ్యాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలు అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం
విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా, బోధనేతర కార్యక్రమాలు అప్పగించి వారిపై భారం పెంచుతున్నారు. పొజిషన్ ఐడీలు అందజేసి జీతాలు అందేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల తరఫున కోరుతున్నాం.
– ఎన్.బాలకృష్ణ, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి
రెండు నెలలైనా..
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కొత్త పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతాలు అందలేదు. జూలై నెల జీతాలు కూడా అందే పరిస్థితి లేదు. మోడల్ ప్రైమరీ పాఠశాలలకు, క్లస్టర్ పాఠశాలల్లో నియమించిన ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థి అనుమతి తెప్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జీతాలు పడకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులకు వేతనాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలి. లేకుంటే ఉద్యమం తప్పదు.
– ఎస్.మురళీమోహన్రావు,
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
న్యూస్రీల్
పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడం అన్యాయం
కొత్త పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయుల దుస్థితి
ఆర్థిక అనుమతులు తీసుకురావడంలో అధికారుల అలసత్వం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉపాధ్యాయులు
సమస్య పరిష్కరించకుంటే ఉద్యమం
ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక
సమస్యంతా పొజిషన్ ఐడీలతోనే...
ఉపాధ్యాయులకు బదిలీ అయిన తరువాత వారి ప్రాంతాల్లో జీతాలు అందుకునేలా అక్కడ డీడీవోకు సమాచారం అందించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారందరికీ పొజిషన్ ఐడీలు కేటాయించాలి. గత నెలలో దాదావు ఉపాధ్యాయులందరికి బదిలీలు పూర్తయ్యాయి. బదిలీలు జరిగి నెల రోజులు గడుస్తున్నప్పటకీ ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించడం లేదు. ఫలితంగా గత జూన్ నెల వేతనాలు ఇప్పటికీ అందలేదు. జూలై నెల జీతాలు కూడా అనుమానాస్పదమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొజిషన్ ఐడీలకు సంబంధించి అమరావతిలో విద్యా శాఖ కార్యాలయంలో పనులు జరగాల్సి ఉందని, అది కాస్త జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25లోగా ఆ పనులు జరగకుంటే జూలై నెల జీతాలు కూడా ఒకటో తారీఖున పడే పరిస్థితి ఉండదని ఆవేదన చెందుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు విద్యా శాఖ అధికారులకు తమ సమస్యలు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం.

జీతాల్లేవు...!

జీతాల్లేవు...!

జీతాల్లేవు...!

జీతాల్లేవు...!