గరుగుబిల్లి: ఫారంపాండ్ల నిర్మాణంతో వాననీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా గరుగుబిల్లి మండలం కొంకడివరం గ్రామంలో ఉపాధిహామీ నిధులతో నిర్మించిన సామూహిక ఫారంపాండ్స్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. గ్రామంలో కొత్తగా ఫారంపాండ్ నిర్మాణం పనులను ఆయన గునపాంతో తవ్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త ప్రాణకోటికి జలమే జీవనాధారమని, జలాల ఆవశ్యకతను తెలుసుకొని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. భూగర్భ జలాలను పెంపొందించుకోకుంటే భవిష్యత్లో నీటి కష్టాలు తప్పవన్నారు. భావితరాలకు నీటి కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గ్రామంలో ఫారంపాండ్ పను లు ప్రారంభించిన రైతు అల్లు తిరుపతినాయుడును కలెక్టర్ దుశ్శాలువతో సత్కరించారు.
ఆయిల్ పామ్ సాగును పెంచాలి
ఆయిల్పామ్ సాగును పెంపొందించేందుకు రైతు లు ముందుకు రావాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రైతులకు పిలుపునిచ్చారు. మండలంలోని కొంకడి వరంలో సర్పంచ్ అల్లు అప్పలనాయుడు సాగుచేస్తున్న ఐదెకరాల ఆయిల్ పామ్ పంటను పరిశీలించి అభినందించారు. రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి చూపాలన్నారు. ఉద్యానవన పంటలను సాగుచేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె. రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఓ.ప్రభాకరరావు, తహసీల్దార్ పి.బాల, ఎంపీడీఓ జి.పైడితల్లి, సర్పంచ్ అల్లు అప్పలనాయుడు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్