చిత్రంలో ఉన్న శిథిల భవనం, ఆ పక్కనే వేసిన లే అవుట్ను చూశారా... ఇవి వీరఘట్టం మండలం తలవరం గ్రామంలో ఓ టీడీపీ నాయకుడి రియల్ ఆక్రమణల పర్వానికి నిలువెత్తు సాక్ష్యాలు. గ్రామస్తులకు వైద్యసేవలందించేందుకు 25 ఏళ్ల కిందట రూ.5లక్షల ఖర్చుతో హెల్త్సెంటర్ భవనాన్ని నిర్మించారు. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరింది. ఆరేళ్ల కిందటే ఆ భవనాన్ని ఖాళీ చేసి హెల్త్సెంటర్ను ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా స్థానిక టీడీపీ నాయకుడు ఆ భవనంపై కన్నేశాడు. అధికార బలంలో కూల్చేసి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా వేసిన తన లే అవుట్లో కలిపేశాడు. ‘రియల్’ దందాకు పూనుకున్నాడు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ చందక సత్యనారాయణ వద్ద ప్రస్తావింగా తలవరం గ్రామంలో ఉన్న పాత హెల్త్ సెంటర్ భవనాన్ని కూల్చేసి ఆక్రమించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
– వీరఘట్టం