నరసరావుపేట: రాబోయే నాలుగు రోజుల పాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ ఆదేశించారు. ఈ మేరకు ఆమె జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు పని వేళల్లో మార్పులు చేసి, నీడ, చల్లని తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అగ్నిమాపక వాహనాలు, సిబ్బందిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించాలని అన్నారు. గ్రామ, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఎండల వల్ల మూగజీవాలకు ఇబ్బంది కలుగకుండా, వాటికి తగిన నీటి సౌకర్యం, షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు.


