చిలకలూరిపేట టౌన్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారిపై రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును ఆపి సోదా చేశారు. ఎటువంటి పత్రాలు లేని రూ.45.30 లక్షల నగదు వెలుగుచూసింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్ను విచారించారు. చైన్నెలో బంగారం కొనుగోలుకు వెళ్తున్నట్లు అతను తెలిపాడు. ఆధారాలు చూపలేకపోవడంతో ఎస్ఐ నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు.


