సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల బంగారు నగల విక్రయాలు పూర్తిగా పడిపోతున్నాయని, కొనేవారు లేక వ్యాపారులు, ఆర్డర్లు లేక వృత్తిదారులు అల్లాడుతున్నారని ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శిరసాల వాసుబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన స్వర్ణకార సంఘం పిలుపు మేరకు నిర్వహించిన బంద్కు యూనియన్ పూర్తి మద్దతు తెలియ జేస్తుందన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో వాసుబాబు మాట్లాడుతూ.. సాక్షాత్తు ప్రధానమంత్రి సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకండి అని పిలుపు నివ్వటం వల్ల స్వర్ణకార వృత్తిపై, వారి కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి నెల కొందన్నారు. ఆర్టీజీఎస్ కాకుండా అప్రైజర్స్ కూడా ఆర్థికంగా నష్టాలు పాలవుతార న్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు వెంటనే వెనక్కి తీసుకొని స్వర్ణకారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకునే విధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. స్వర్ణకారులు రోడ్డున పడకుండా ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలన్నారు. గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ తరఫున స్వర్ణకార సంఘం చేస్తున్న ఆందోళన, బంద్లకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ నయీమ్ అహ్మద్, యూనియన్ బాధ్యులు చిన్ని, సందీప్, వెంకటా చారి, సభ్యులు తదితరులు ఉన్నారు.
ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుబాబు


