● వీఆర్ఏల డిమాండ్లు వెంటనే
పరిష్కరించాలి
● జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు
వినతిపత్రం అందజేత
నరసరావుపేట: పల్నాడు జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు పే స్కేలు జీతాలు అమలు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచెమెన్ పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఏల చేత భర్తీ చేయాలని, నామినీలుగా గుర్తించాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ వద్ద సమస్యల పరిష్కార నిమిత్తం ఆందోళన నిర్వహించారు. నినాదాలు చేస్తూ పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.
● బందగీసాహెబ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఎనిమిదేళ్ల నుంచి జీతాలు పెరగలేదని, ప్రక్క రాష్ట్రాలలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో పే స్కేల్, జీతాలు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు.
● అక్రమ డ్యూటీల పేరుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
● రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ఏప్రిల్ 20 నుంచి సమ్మె బాట పడతారని ప్రకటించారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
● అనంతరం సమస్యల మీద జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేశారు.
● అమరావతి, పిడుగురాళ్ల మండలాలలో వీఆర్ఏల చేత అదనపు డ్యూటీల విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లగా, కచ్చితంగా తహసీల్దారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలియజేశారు.
● అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
● జిల్లా ముఖ్య నాయకులు రవి, మునాఫ్, రోశయ్య, కాసులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.


