కాళ్లు దువ్విన కోళ్లు
రొంపిచర్లలో కోడి పందేల జోరు చేతులు మారిన లక్షలాది రూపాయలు
నరసరావుపేటటౌన్: కోడి పందేలకు.. కోత ముక్కలకు.. గుండు ఆటకు రొంపిచర్ల మండలం కేరాఫ్ అడ్రస్గా మారిందా అంటే.. అవుననే అంటున్నారు అనుభవజ్ఞులు. ఇటీవల కాలంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో పేకాట, కోతముక్కా, గుండు ఆట, కోడిపందేలు పెచ్చుమీరాయి. విప్పర్ల, కొనకంచివారిపాలెం, గ్రామాల్లో శివరాత్రి పండుగ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కోడి పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పందెగాళ్లకే కాకుండా చూడటానికి వెళ్లిన ప్రేక్షకుల వద్ద కూడా ద్విచక్ర వాహనానికి, కార్లకు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. కోతముక్క, గుండాట ఆడే పందెగాళ్ల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజు వసూలు చేసి సకలం ఏర్పాట్లు చేశారు. కోడికి కూడా ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు, పోరులో గెలిచిన పందెం కోడి యజమాని వద్ద నుంచి రూ.ఐదు వేల రూపాయలు వసూలు చేశారు. రాత్రి వేళ కూడా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.
ముందే తెల్సినా నియంత్రించలేదు..
శివరాత్రి పండగకూ ముందే కోడిపందేలు, పేకాట నిర్వహణకు బరులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు చేయటంతో అధికారులు మిన్నకున్నారు. బరుల నిర్వాహకుల వద్ద లంచం తీసుకొని వారికి సహకరించారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రొంపిచర్లలో బహిరంగంగా జూదం నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.
కాళ్లు దువ్విన కోళ్లు


