మాచర్ల: పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, చెన్నకేశవాచార్యులు, ఈఓ ఐ. సైదారావుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమెర అనంతరాములు, ఈఓ ఆధ్వర్యంలో రాత్రి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు దంపతులు పాల్గొన్నారు.
కాపాడిన స్థానికులు
వేటపాలెం: మండల కేంద్రం వేటపాలెంలో జింక పిల్ల ప్రత్యక్షం అయింది. ఈ జింక పిల్లను కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. వాటి నుంచి తప్పించుకున్న జింక రైల్వే ట్రాక్ దగ్గరలోని సమైక్యనగర్ ప్రాంతానికి వచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను తరిమేశారు. అప్పటికే జింక వెనుక కాళ్ల వద్ద కుక్కలు కరిచాయి. స్థానికులు దానిని రిక్షాపై పశువైద్యశాలకు తరలించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. జింక పిల్ల వేటపాలెం రావడం ఇదే మొదటి సారి కావడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన బూరుగుపల్లి శివరామకృష్ణ– వాణి దంపతులు, వారి బంధువు భోగవల్లి దివ్యతేజలు కలిసి 25.950 గ్రాముల బంగారు గొలుసును ఆలయ సూపరింటెండెంట్ రాజు చేతుల మీదుగా అమ్మవారికి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఉత్సవ కమిటీ మాజీ సభ్యుడు చుంచు రమేష్బాబు, నాయకులు రేగండ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ వారిని శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. గర్భాలయంలో ఉదయం అర్చకులు అభిషేకాలు చేస్తున్న సమయంలో మూలవిరాట్ను ఉదయం 6.30 నుంచి 6.45 గంటల మధ్యలో సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని సూర్య కిరణాలు వెలిగించిన దివ్య తేజస్సును చూసి భక్తులు పరవశులయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డుపై నీటితో తడుపుతూ, మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. యనమలకుదురుకు చెందిన గొట్టిపాటి పూర్ణచంద్రరావు, ప్రమీలరాణి దంపతులు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.


