వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన శుక్రవారం భ్రమరాంబ అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు. దేవస్థానంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, పంచహారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు గ్రామ బలిహరణ, 8.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, నిత్యౌపాసన, గ్రామబలిహరణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పంచహారతులు ఇచ్చారు. ఆదివారం రాహు కేతు పూజలు, 100 అభిషేకాలు మినహా అన్ని అర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. తెనాలి రమేష్బాబు బృందంచే భక్తిరంజని, నటరాజ నృత్యనిలయం విజయవాడ వారిచే కూచిపూడినృత్యం, వెనిగండ్ల ఉల్లంగుల బ్రహ్మం ఆధ్వర్యంలో గయోపాఖ్యానం నాటకం నుంచి యుద్ధసీను, నిడుబ్రోలు వేపసూరి వెంకట్రావు ఆధ్వర్యంలో బాలనాగమ్మ నాటకం నుండి ఫకీరు, సంగు సీన్లు అద్భుతంగా ప్రదర్శించారు.
వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు


