ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకున్న 281మంది న్యాయవాదులు
నరసరావుపేట: రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం స్థానిక న్యాయవాద సంఘ కార్యాలయంలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 303 ఓట్లు ఉండగా 281 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10.30నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు ఉత్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. న్యాయవాద సంఘం అధ్యక్షుడు జీవీసుబ్బారావు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు కట్టా నారపరెడ్డి, సీజే ప్రతాప్, ఎస్.అయ్యప్పరాజు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. మొత్తం ప్రక్రియ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన మూడు సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయబడింది. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ బాక్స్లను ఏపీ బార్ కౌన్సిల్కు కొరియర్ ద్వారా పంపే ఏర్పాట్లు చేశారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్లో నూతనంగా ఏర్పాటు చేసే ఎయిర్ పోర్ట్కు కావాల్సిన భూములను ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు అయిషీరాజ్, పరజిట్ ముఖర్జీలు మాచర్ల తహసీల్దార్ కిరణ్కుమార్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. మాచర్ల మండలం పశువేముల గ్రామంలో భూములను వీరు పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు తమ పరిధిలోని భూములను పరిశీలన జరిపి ఎయిర్ పోర్టు డవలప్మెంట్ అథారిటీ సభ్యులతో మాట్లాడారు. నూతన ఎయిర్ పోర్టు కోసం విజయపురిసౌత్, నాగులవరం, పశువేముల పంచాయతీల పరిధిలో భూమిని సేకరించాల్సి ఉంది.
ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు


